Friday, April 19, 2024

గొర్రెల పథకంలో దళారులకే లబ్ధి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రభ న్యూస్ ప్రతినిధి/యాదాద్రి : గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు కాకుండా దళారులకే లబ్ధి చేకూరుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం మగ్గంపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా శెట్టి అశోక్ గొర్ల కాపరి ఎదురొచ్చి గొర్రెల పంపిణీ పథకంలో వచ్చిన గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ రావడం లేదని, ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం ముందే తీసుకున్నారని చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం గొల్ల కురుమలకు ఏమాత్రం ప్రయోజనం లేదని, వెటర్నరీ డాక్టర్లకు, ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు కొనుగోలు చేసే దళారులకు కమీషన్లు దండిగా వస్తున్నాయని చెప్పారు. ఓట్ల రాజకీయం కోసం పెట్టిన ఈ పథకం తమ జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేదని వివరించారు‌. కొంత మంది గొర్రెల కోసం డీడీ రూపేనా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి సంవత్సరం దాటుతున్న గొర్ల పంపిణీ జరగలేదని వాపోయారు. గొర్రెలు, బర్లు కాకుండా తమ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం అందించే పథకాలు తీసుకురావాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement