Wednesday, April 17, 2024

వన్‌ ఎమ్మెల్యే, వన్‌ పెన్షన్‌.. ఎన్నిసార్లు ఎన్నికైనా ఒకే పెన్షన్

చండీగడ్‌ : పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ సింగ్‌ మాన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాతి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆమ్‌ ఆద్మీతో సమానమనే విధంగా వ్యవహరిస్తున్నారు. సింప్లిసిటీ కొనసాగిస్తూనే.. ప్రజా ధనాన్ని సరైన రీతిలో ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భగవంత్‌ మాన్‌ తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలకు ఒకే పెన్షన్‌ ఇస్తామని ప్రకటించి సంచలన సృష్టించారు. ఇకపై వన్‌ ఎమ్మెల్యే.. వన్‌ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేల ఫ్యామిలీ పెన్షన్‌లోనూ కోత విధిస్తున్నట్టు తేల్చి చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతుండటంతో.. పదవీ కాలం ముగిసిన ప్రతీ సారి వారికి కొత్తగా మరో పెన్షన్‌ ఇవ్వడం సంప్రదాయంగా వచ్చింది.

ప్రభుత్వ ఖజానాకు భారం..

ఈ క్రమంలో ఒక్కొక్కరు రూ.3.50లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు పెన్షన్‌ అందుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిందని గ్రహించిన సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌.. వన్‌ ఎమ్మెల్యే.. వన్‌ పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యేలలో కొందరు ఎంపీలుగానూ సేవలు అందిస్తున్నారు. వారు పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నందుకు ఆ పెన్షన్‌ కూడా అందుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్‌, ఎంపీగా కూడా పెన్షన్‌ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలా ఆదా అయిన మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామని ప్రకటించారు. రాజకీయ క్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తామని చేతులు జోడించి నేతలు ఓట్లు అడుగుతారని, ఎన్నికయ్యాక లక్షల రూపాయల పెన్షన్‌ అందుకుంటారన్నారు. ఇలా తీసుకునే వారిలో చాలా మంది కనీసం అసెంబ్లిdకి కూడా రారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement