Tuesday, March 26, 2024

మరోసారి ఎయిర్‌ఇండియా వీఆర్‌ఎస్‌.. 40 ఏండ్లు పైబడిన వారికి ఆఫర్‌

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా మరోసారి ఉద్యోగులకు స్వచ్ఛంధ పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిన వెంటనే ఉద్యోగులకు గతంలో మొదటిసారి వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఈ సారి ప్రధానంగా నాన్‌ ప్లయింగ్‌ స్టాప్‌ కోసం ఈ స్కీమ్‌ను తీసుకు వచ్చింది. ఐదు సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకుని 40 సంవత్సరాల వయస్సు దాటిన పర్మినెంట్‌ జనరల్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్‌, నైపుణ్యంలేని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఈ ఆఫర్‌కు ఎయిర్‌ ఇండియాలోని 2,100 మంది వరకు అర్హులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

ప్రస్తుతం సంస్థలో ప్లయింగ్‌, నాన్‌-ప్లయింగ్‌ సిబ్బందితో కలిపి మొత్తం 11 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన తరువాత మొదటిసారి 2022 జూన్‌లో వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్‌ను ప్రకటించింది . అప్పుడు ప్లయింగ్‌, నాన్‌-ప్లయింగ్‌ కేడర్‌లో వీఆర్‌ఎస్‌ స్కీమ్‌కు 4,200 మంది అర్హత పొందారు. ఇందులో 1,500 మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. రెండో సారి ప్రకటించిన స్కీమ్‌కు మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 30 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చని ఎయిర్‌ ఇండియా తెలిపింది. వీరికి ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ఒకే సారి చెల్లిస్తారు. మార్చి 31 లోపు అప్లయ్‌ చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా మొత్తానికి అదనంగా లక్ష రూపాయలు ఇస్తామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

పాత తరం వారికి వీఆర్‌ఎస్‌ ఇచ్చి, కొత్త తరం ఉద్యోగులను నియమించుకోవాలని ఎయిర్‌ ఇండియా భావిస్తోంది. తొలి విడతలో వీఆర్‌ఎస్‌ తీసుకోని వారికి, ఇతరులకు కూడా ఈ అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరినందున రెండోసారి ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు ఎయిర్‌ ఇండియా చీఫ్‌ హెచ్‌ఆర్‌ సురేష్‌ దత్‌ త్రిపాఠి తెలిపారు. ఎయిర్‌ ఇండియాను భారీగా విస్తరించాలని నిర్ణయించిన టాటా గ్రూప్‌, పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్‌ పెట్టింది. దశల వారిగా వచ్చే కొత్త విమాన సర్వీస్‌ల్లో పని చేసేందుకు 5 వేల మంది కొత్త సిబ్బందిని నియమించుకోవాలని కూడా టాటా గ్రూప్‌ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement