Friday, March 29, 2024

అక్టోబర్‌ 11న 33 కొత్త గురుకులాలు ప్రారంభం.. వెళ్ల‌డించిన మంత్రి గంగుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీసీల కోసం కొత్తగా ఏర్పాటు చేయనున్న గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 కొత్త గురుకులాలు అక్టోబర్‌ 11 నుంచి, కొత్త డిగ్రీ కాలేజీలను అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్త గురుకులాలు, డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై అధికారులతో సమీక్షను మంత్రి గంగుల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో ఆయా జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆయన సుచించారు. గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు హాలియా,దేవరకద్ర, కరీంనగర్‌, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు.

కొత్తగా 33 గురుకులాలు ఏర్పాటు చేయడంతో వాటి సభ్య 310కి చేరిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న 80,025 ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్ళను మరింత విస్తృతంగా అభ్యర్థులకు సేవలను అందించాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. 12 స్టడీ సర్కిళ్ళకు అదనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్‌, డియస్సీ తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25 వేల మందికి పైగా నేరుగా లబ్ధి చేకూరుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement