ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్లో రికార్డ్ స్థాయిలో 25 వేల యూనిట్లను విక్రయించింది. ఈ నెలలో ఓలా మార్కెట్ షేర్ 30 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దశలోనూ దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు పెరిగాయని ఓలా ఫౌండర్, సీఈఓ భావిష్ అగర్వాల్ చెప్పారు. మిషన్ ఎలక్ట్రిక్ కు తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే దేశమంతా విస్తరిస్తామని చెప్పారు. ఇండియా మార్కెట్లో ఈవీ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. త్వరలోనే ఓలా అనేక కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తుందన్నారు.
ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 100 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉన్నాయి. వీటిని 2023 మార్చి నాటికి 200 కు పెంచనున్నట్లు చెప్పారు. 2027 నాటికి ఓలా నుంచి మరో ఆరు వాహనాలు మార్కెట్లోకి వస్తాయని ఆయన చెప్పారు. వచ్చే రెండు సంవత్సరాల్లో పలు టూ వీలర్స్ను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు. ఓలా నుంచి మాస్ మార్కెట్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు విడుదల చేస్తామన్నారు. వీటితో పాటు స్పోర్ట్స్ బైక్లు, క్రూయిజర్స్, ఎండ్వంచర్ రోడ్ బైక్స్ వస్తాయన్నారు. 2024 నాటికి ఓలా విద్యుత్ కారు మార్కెట్లోకి వస్తుందని చెప్పారు.