Thursday, April 25, 2024

ఔటర్‌పై ఆర్టీసీ బస్సులు.. స‌ర్వే చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : అంతర్జాతీయ నగరంగా రూపు దిద్దడానికి పరుగులు పెడుతున్న హైదరాబాద్‌ మహానగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే అనేక సర్వేలు, అధ్యయనాలు చేపడుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన ఏర్పాట్లపై నిర్వహిస్తున్న సర్వే నివేదికలను ఉవ్టూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తోంది. మెట్రోరైలు రెండవ దశ నిర్మాణంలో ఐటీ కారిడార్‌ నుంచి నేరుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేరుకునే ప్రజారవాణా సాధంగా చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంచేశారు. అయితే మెట్రో రెండవ దశ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని బావించిన U.M.T.A (హైదరాబాద్‌ యూని ఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌ఫోర్టు అథారిటీ) ప్రత్నామ్నాయంగా ఔటర్‌ మీదుగా ప్రజారవాణా కోసం ఆర్టీసీ బస్సులను నడిపించే విషయంపై ఆలోచనలు జోరుగా సాగుతున్నాయి.

ఔటర్‌పై ప్రతిరోజు నడుస్తున్న లక్షా 30వేల వాహనాలలో సగం వరకు ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌, గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరువు వరకే సగం వాహనాలు నడుస్తున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి, ప్రజారవాణాకు సంబంధించిన వాహనాలను ఓఆర్‌ఆర్‌పై అనుమతించడం వల్ల కోర్‌ సిటీలో ఉన్న ట్రాఫిక్‌ను కొంత మేరకు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని U.M.T.A అధికారులు బావిస్తున్నారు.

- Advertisement -

గచ్చిబౌలి- శంషాబాద్ మధ్య పెరిగిన ట్రాఫిక్..

గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోజుకు లక్షా 30వేల వరకు వాహనాలు పరుగులు పెడుతున్నాయి. ఇందులో గచ్చిబౌలి-శంషాబాద్‌, శంషాబాద్‌-పటాన్‌చెరువు మార్గాల్లో సగానికి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ వెల్లడించిన అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల సేవలు లేకపోవడంతో ప్రజలు సొంత వాహనాలు, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తుండటంతో రద్దీ పెరుగుతుంది. వ్యక్తిగత వాహనాల, ప్రైవేట్‌ వాహనాల సంఖ్యను తగ్గించడా నికి ఔటర్‌ సర్వీస్‌రోడ్ల మీదుగా ఆర్టీసీ బస్సులను నిర్వహించాలని హెచ్‌ఎండీఏ అధికారులు ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే శంషాబాద్‌-గచ్చిబౌలి మధ్య రూట్‌ నెంబర్‌ 316 ఆర్టీసీ బస్సును నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో శంషాబాద్‌ నుంచి పటాన్‌చెరువు వరకు ఆర్టీసీ బస్సులను నిర్వహించడం ద్వార ప్రయాణికుల అవసరాలు తీరుతాయని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో కీలకంగా మారిన గచ్చిబౌలి కేంద్రంగా ప్రయాణికులు ఔటర్‌ మీదుగా శంషాబాద్‌ వరకు, శంషాబాద్‌ నుంచి కోకాపేట మీదుగా పటా న్‌చెరువు వరకు, తిరిగి పటాన్‌చెరువు నుంచి ఐటీ కారిడార్‌, శంషాబాద్‌ వరకు ప్రతిరోజు ప్రయాణిస్తూ.. వారి వివరాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం కాలుష్య రహితంగా ఉండడం కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను నడపడం ద్వార రెండు విధాలుగా మేలు జరిగేలా అవకాశం ఉంటుందని U.M.T.A అధికారులు బావిస్తున్నారు. దీని వల్ల ఓఆర్‌ ఆర్‌పై ట్రాఫిక్‌ను తగ్గించే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement