Saturday, April 20, 2024

ఆణివారి ఆస్థానం సంద‌ర్భంగా -శ్రీవారి ఆల‌యంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన ఆణివారి ఆస్ధానం సందర్భంగా ..నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. వేకువజాము నుండి టిటిడి అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు టిటిడి అధికారులు.ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోమ్ము, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తారీఖున ఆణివారి ఆస్ధానం పురస్కరించుకొని ముందు మంగళవారం రోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంను ఇవాళ వైభవంగా నిర్వహించామ‌న్నారు.ఏడాదిలో ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు. సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన పరిమళాన్ని స్వామి వారికీ సమర్పించి,ఆలయ గోడలపై పూతగా పూశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement