Thursday, March 28, 2024

మతం కంటే మానవత్వం గొప్పది: నారా భువనేశ్వరి

కరోనా విపత్తు సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్‌ విశిష్టమైన సేవలు అందిస్తోందని ఎన్టీఆర్ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు.

హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారికి టెలీమెడిసిన్ ద్వారా వైద్య సహాయం, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. మతం కంటే.. మానవత్వం ముఖ్యమన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చి… అవసరమైన వారికి ఇళ్లవద్దకే మందులు పంపిణీ చేస్తున్నామని.. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరాదన్న లక్ష్యంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 78వేల మందికి ఆహారం అందించామని వివరించారు. అవసరమైతే మరింతగా అన్నదాన కార్యక్రమాలు చేపడతామని, ఆపన్నులకు అండగా నిలుస్తామన్నారు. కుటుంబసభ్యులు ముందుకురాని, అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో వారివారి ఆచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం చేసి.. పేదలకు తామున్నామనే భరోసా కల్పిస్తామని, మానవ సేవే మాధవ సేవ అనే నినాదం స్పూర్తిగా ముందుకు సాగుతున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement