Wednesday, March 27, 2024

ఇక అంగన్ వాడీలుండవ్.. అన్నీ ప్రీ స్కూల్స్ గా మర్చేస్తరట..

హైదరాబాద్‌,ప్ర‌భ‌న్యూస్: అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిగా పూర్వ ప్రి స్కూల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలైనాయి. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు డిజిటల్‌ క్లాసుల్లో బోధన చేసేందుకు సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. కొవిడ్‌ సమయం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలను బోధిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విద్య వైపు అంగన్‌వాడీ విద్యార్థులను మరింత ఆకర్షించేందుకు డిజిటల్‌ బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంచేస్తున్నారు. డిజిటల్‌ బోధనను ముందుగా చార్మినార్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులోని సైదాబాద్‌ సెక్టార్‌ పరిధిలో గల సింగరేణి కాలనీలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో డిజిటల్‌ క్లాస్‌లకు శ్రీకారం చుట్టారు. డిజిటల్‌ బోధన పట్ల చిన్నారులు కదలకుండా ఉండటం, బోధనకు ఆసక్తి కనబర్చుతుండటంతో ప్రాజెక్టులోని మిగతా అంగన్‌ వాడీల్లో సైతం విస్తరించాలని యోచనలో అధికారులున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో సూమారుగా 15ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులుండగా.. వీటి పరిధిలో 3,307 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఐదు ఐసీడీఎస్‌ పరిధిలో 914 కేంద్రాలుండగా, అందులోనే రెండు మినీ కేంద్రాలున్నాయి. ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు పిల్లలు 13,715 మంది పిల్లలు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు 13,715 మంది చిన్నారులున్నారు. ఇక మేడ్చల్‌ పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో 763 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు చిన్నారులు 93,325 మంది, రంగారెడ్డి జిల్లాలో ఏడు ప్రాజెక్టులకు గాను 1600 కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు 61,026 మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల వరకు 3,035 మంది చిన్నారులున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement