Tuesday, March 26, 2024

వరుసగా నాలుగోసారి ఐఐటీ మద్రాస్ ఫస్ట్​.. ఆ తర్వాత ఐఐఎస్సీ బెంగళూరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-మద్రాస్ వరుసగా నాలుగో సంవత్సరం ‘ఓవరాల్’ ర్యాకింగ్‌లో టాపర్‌గా నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నిర్వహించిన ర్యాంకింగ్ పోటీలో దేశవ్యాప్తంగా 7,254 ఉన్నత విద్యాసంస్థలు పాల్గొన్నాయి. విద్యాబోధన, వనరులు, పరిశోధన సహా ఇంకా అనేక ఇతరాంశాలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంకులను నిర్థరించింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడికల్, డెంటల్, రీసెర్చ్, టాప్-3 కాలేజీలు, ఓవరాల్ వంటి కేటగిరీల్లో ర్యాంకులను రూపొందించగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ఆయా విభాగాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. గత మూడేళ్లుగా ఇంజనీరింగ్ కేటగిరీతో పాటు ఓవరాల్ ర్యాంకింగ్‌లోనూ మొదటిస్థానంలో నిలుస్తున్న ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది కూడా మొదటిస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఓవరాల్ కేటగిరీలో రెండో స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ బాంబే నిలిచాయి. ఓవరాల్ కేటగిరీలో మొదటి 10 స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సంస్థ కూడా నిలవలేదు. అయితే ఐఐటీ హైదరాబాద్ 14వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలవగా, ఎన్ఐటీ వరంగల్ 45వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానంలో నిలిచాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 71వ స్థానంలో నిలిచింది.

‘యూనివర్సిటీ’ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు వరుసగా 7వ సంవత్సరం మొదటిస్థానంలో నిలిచింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలోనే ఉన్న జామియా మిలియా ఇస్లామియా ఈ విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టాప్ 10లో హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచి స్థానం సంపాదించుకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి 22వ స్థానం దక్కగా, ఆంధ్రప్రదేశ్‌లోని వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ (కేఎల్ యూనివర్సిటీ) 27వ స్థానం దక్కించుకుంది.

‘ఇంజనీరింగ్’ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఏడేళ్లుగా మొదటిస్థానంలో నిలుస్తూ వచ్చింది. రెండోస్థానంలో ఐఐటీ ఢిల్లీ, మూడోస్థానంలో ఐఐటీ బాంబే నిలిచాయి. తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్ 9వ స్థానం దక్కించుకోగా, వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 21వ స్థానం దక్కించుకుంది. ‘మేనేజ్మెంట్’ విభాగంలో మొదటిస్థానంలో ఐఐఎం అహ్మదాబాద్, రెండోస్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడోస్థానంలో ఐఐఎం కోల్‌కతా నిలిచాయి. ‘ఫార్మసీ’ కేటగిరీలో ఢిల్లీలోని జామియా హమ్‌దర్ద్ మొదటిస్థానంలో నిలవగా, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండవస్థానాన్ని దక్కించుకుంది. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ 3వ స్థానంలో నిలిచింది.

కళాశాలల’ కేటగిరీలో టాప్-10 జాబితాలో 5 కాలేజీలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి. మొదటిస్థానంలో న్యూఢిల్లీలో మిరిండ హౌజ్ నిలవగా, రెండో స్థానంలో హిందూ కాలేజి, మూడోస్థానంలో చైన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజి నిలిచాయి. ‘ఆర్కిటెక్చర్’ విభాగంలో మొదటిస్థానంలో ఐఐటీ రూర్కీ, రెండోస్థానంలో ఎన్ఐటీ కాలికట్, మూడోస్థానంలో ఐఐటీ, ఖరగ్‌పూర్ నిలిచాయి. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 7వ స్థానంలో నిలిచింది. ‘లా ‘విభాగంలో మొదటిస్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, రెండోస్థానంలో నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ, మూడోస్థానంలో సింబియాసిస్ లా స్కూల్, పూణే నిలిచాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 4వ స్థానంలో నిలిచింది.

‘మెడికల్’ కేటగిరీలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూఢిల్లీ మొదటిస్థానంలో నిలవగా, రెండోస్థానంలో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 2వ స్థానంలో నిలిచింది. మూడోస్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వేలూర్ (తమిళనాడు) నిలవగా ఈ విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క విద్యాసంస్థ కూడా టాప్-50లో చోటు దక్కించుకోలేకపోయాయి. ‘డెంటల్’ కేటగిరీలో సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ – చెన్నై, రెండోస్థానంలో మణిపాల్ కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ – మణిపాల్, మూడోస్థానంలో డా. డీవై పాటిల్ విద్యాపీఠ్, పూణే నిలిచాయి. ‘రీసెర్చ్’ కేటగిరీలో మొదటిస్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, రెండోస్థానంలో ఐఐటీ మద్రాస్, మూడోస్థానంలో ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. ఈ విభాగంలో హైదరాబాద్‌లోని ఐఐటీ 12వ స్థానంలో నిలిచింది. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement