Friday, April 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు

ఎకరం నీటి వనరులకు ఒకరికి సభ్యత్వం కల్పించాలి
పాత సొసైటీలకు ఇబ్బంది లేకుండా కొత్త సొసైటీలు ఏర్పాటు
ఫిషరీస్ అధికారులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు

ప్ర‌భ న్యూస్ బ్యూరో, ఉమ్మ‌డి మెద‌క్ : ఎన్నో ఎళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని కాని ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారు. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఆర్థిక‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు పెరిగాయ‌ని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీట వనరులు గణనీయంగా పెరిగాయ‌న్నారు. ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోంది. చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించాం, దీని వల్ల నీటి వనరులు పెరిగాయి. వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చు అన్నారు. ఇలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంది. దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చు అన్నారు.

సిద్దిపేట జిల్లాలో 281 సోసైటీలు ఉండగా అందులో 20731 మందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటివనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15724 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దాదాపు సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10434 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మండల వారీగా, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తెల్చాలని ఫిషరీస్ శాఖకు మంత్రి హరీశ్ రావు ఆదేశం. ఏ చెరువు వర్షం మీద ఆదారపడి ఉంది, ఏ చెరువుకు కాలువల నీరు చేరుతుందన్న సమాచారం సేకరించాలి అన్నారు. ఏ సోసైటీ లో ఎందరు సభ్యులు ఉన్నారు. కొత్తగా ఎంత మంది చేర్చుకోవచ్చు అన్న సమాచారం పక్కాగా సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయి. సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుంది. రుణ సౌకర్యం సుళువుగా జరుగుతుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికీ వర్తిస్తాయ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, పారూఖ్ హుస్సెన్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫిషరీష్ శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement