Friday, April 26, 2024

New Era – మోడీ చేతుల మీదుగా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం జాతికి అంకితం…

న్యూఢిల్లీ – ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు.. ముందుగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. అనంతరం నూతన పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి శృంగేరీ పీఠాధిపతులు కలశంతో స్వాగతం పలికారు. ఆ త‌ర్వాత అప్పటికే రాజదండానికి (సెంగోల్)కు పూజలు నిర్వహించగా మోడీ దానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అధీనం మఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్‌సభలోని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్ఠించారు మోడీ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మఠాధిపతుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనల్లో స్పీకర్ ఓం బిర్లా, కేబినెట్ మంత్రులతో కలిసి మోడీ పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను మోదీ సన్మానించారు. అనంత‌రం పార్ల‌మెంట్ భ‌వ‌న్ లోని వివిధ విభాగాల‌ను మోడీ స్పీక‌ర్, త‌న క్యాబినేట్ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి పరిశీలించారు.

మ‌ధ్యాహ్నం షెడ్యూల్
మధ్యాహ్నం రెండు గంట‌ల‌కు జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి.
ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ ప్రసంగిస్తారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడతారు.
పార్లమెంట్‌ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు.
తర్వాత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. స్పీకర్‌ ప్రసంగం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మాట్లాడానికి సమయాన్ని కేటయించారు
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్ర‌సంగిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement