Thursday, March 28, 2024

జగన్ రెడ్డి పిల్లలను కూడా వదలడం లేదు: నారా లోకేష్

కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై డాక్టర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రధాని మోడీ నుంచి సీఎంలందరిదీ ఒక దారి అయితే జగన్ రెడ్డిది మాత్రం మరో దారి అంటూ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకూడదని ప్రధాని మోదీనే సీబీఎస్ఈ పన్నెండోవ తరగతి పరీక్షలు రద్దు చేస్తే, జగన్ రెడ్డి మాత్రం తాను పరీక్షలు నిర్వహించి తీరుతా అంటున్నారని విమర్శించారు.

రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఎంత పెద్ద మూర్ఖుడైనా చిన్నపిల్లల జోలికి రాడని, జగన్ రెడ్డి మాత్రం పిల్లల్ని కూడా వదలట్లేదని అన్నారు. మూడో దశలో పిల్లపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తుంటే, రాష్ట్రంలో ఇప్పటికే ఆ ప్రభావం మొదలైనా జగన్ పరీక్షలు నిర్వహిస్తామని అంటున్నారని అన్నారు. పది శాతం మంది పిల్లలకు వైరస్ వచ్చిందని, ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు పెడితే, పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సరైన పీడియాట్రిక్ విభాగాలు మన హాస్పిటల్స్‌లో ఉన్నాయా? అని నిలదీశారు.

ప్రభుత్వం దీనికి సమాయత్తం అవుతున్నట్టు కనిపించట్లేదన్నారు. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు కూడా సరిగ్గా జరగలేదన్నారు. పేదలకు ఉపయోగపడే ఫైబర్ నెట్‌ను నాశనం చేశారని… పోనీ సప్తగిరి ఛానెల్‌ను పూర్తిగా ఉపయోగించి, పిల్లలకు అందులో సరైన విధంగా పాఠాలు చెప్పారా? అంటే అదీ లేదని విమర్శించారు. కొన్ని పట్టణాల్లో, ఇంటర్ క్లాసులు మొదలయ్యాయని… ఇప్పుడు పదో తరగతి పరీక్షలు ఉంటాయో? లేదో తెలియదని.. ఈ క్లాసులకు వెళ్ళకపోతే, సబ్జెక్ట్ మిస్ అవుతామనే ఆందోళన పిల్లల్లో ఉందన్నారు.

‘కోచింగ్‌ తరగతులకు హాజరు కావాలా? పరీక్షలకు సన్నద్ధం కావాలా? నిర్లక్ష్యం చేస్తే జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంకు రాదనే భయం విద్యార్థులను వెంటాడుతోంది. సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసినందున ఆ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. స్టేట్ విద్యార్థులు బాధ మాత్రం వర్ణాణాతీతంగా ఉంది. జగన్ రెడ్డి తలతిక్క నిర్ణయాల వలన పిల్లల్లో మానసిక ఆందోళన ఎక్కువవుతోంది. పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం మరింత గందరగోళానికి గురిచేస్తుంది. పాపం విద్యా శాఖ మంత్రి సురేష్‌ది వింత పరిస్థితి. మనసులో జగన్ రెడ్డి గారిని తిట్టుకుంటారు. బయటకు మాత్రం లోకేష్‌ను తిడతారు’ అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement