న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటులో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పేపర్ లీకేజీ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల వల్ల లోక్సభ సజావుగా సాగడం లేదని, త్వరలోనే ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల 5 లక్షల విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడిందని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా టీఎస్పీఎస్సీ ఛైర్మన్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, సిట్ దర్యాప్తు కూడా సరిగ్గా జరగడం లేదని విమర్శించారు. ఛైర్మన్పై ప్రభుత్వం విచారణ జరపకపోవడంతో ఈ కేసుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు.