Tuesday, April 23, 2024

మోడీ పువ్వు గుర్తు పార్టీ పేదోళ్ల‌ కడుపుకొట్టి.. పెద్దోళ్లకు దోచి పెడుతుంది : మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

నిజామాబాద్ : బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ పువ్వు గుర్తు పార్టీ పేదోళ్ల‌ కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచి పెడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇస్తుంటే.. అన్ని రకాల ధరలు పెంచి ప్రతి ఇంటి నుంచి నెలకు 4వేల రూపాయలు మోడీ ప్రభుత్వం దోచుకుంటున్న‌ద‌న్నారు. బీజేపీ మోడీ పాలనలో పేదల పరిస్థితి దారుణంగా త‌యారైంద‌న్నారు. దరిద్రపు బిజెపి పాలన వల్ల మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింద‌న్నారు. ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని విసిరి పారేయాలి అన్నారు.

2011లో కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి 50 రూపాలు పెంచితే అప్పటి బీజేపీ నాయకురాలు, ఇప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరిచి గగ్గోలు పెట్టినారు.. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. ఈరోజు మీరున్న మోడి ప్రభుత్వం 13 సార్లు 750 రూపాలు పెంచింది.. ప్రజలకు ఎం సమాధానం చెప్తారు అన్నారు. పెంచిన ధరలు తగ్గించాలని పేదింటి మహిళల తరుపున కేంద్రాన్ని స్మృతి ఇరానీ డిమాండ్ చేయాలి అన్నారు. సిలిండర్ నిరు పేదల నిత్యావసర వస్తువు.. కుటుంబాలపై గ్యాస్ ధర చాలా ప్రభావం చూపుతుంద‌న్నారు. 35 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధర 450 కే వస్తది.. కానీ మోది ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధాని మోడీ తన గుజరాత్ దోస్తులకు 10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. మోదీ దోస్తు అదాని ఒక్కడికి మాఫీ చేసినన్ని డబ్బులు సబ్సిడీగా ఇచ్చినా దేశంలో సిలిండర్ 450కే వస్తుంద‌న్నారు. మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై సీబీఐ, ఈడి దాడులు చేస్తున్నారు. కేసీఆర్ ధైర్యంగా ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు. కేసీఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు.. నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు అన్నారు. పేదలను అన్ని విధాలా వేదిస్తున్న బీజేపీని, ఆ పార్టీ నాయకుల్ని ఎక్కడిక‌క్క‌డ‌ నిలదీయాలి, బుద్ది చెప్పాలి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement