Wednesday, April 24, 2024

ఉధృతి తగ్గగానే వరద కాలువల ఆధునీకరణ..ఎమ్మెల్యే భూమన..

  • రూ.189 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్…
  • భోజనాలు, నీరు, పాలప్యాకెట్ల పంపిణీ కొనసాగిస్తున్నట్టు వెల్లడి…
  • అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల ముమ్మరం..
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : వరద బాధితులకు తక్షణ అవసరాలు కింద భోజనాలు, నీరు, పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. మరోవైపు అంటువ్యాధులు ప్రబలకుండా, నివారించేందుకు వీలుగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయనున్నట్టు చెప్పారు. దీంతోపాటు వరద ఉధృతి తగ్గి, యధాతద స్థితికి వచ్చిన వెంటనే నగరంలో రోడ్లు, వరద కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో అభివృద్ధి పనులకు రూ. 189 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. స్థానిక ఉప్పరపల్లి, సరస్వతి నగర్, యశోద నగర్, గాయత్రి నగర్, శ్రీ క్రిష్ణ నగర్, లక్ష్మీ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, అధికారులు ప‌ర్య‌టించారు..
.
రోడ్లపై పేరుకుపోయిన ఇసుక వ్యర్థాలను ఎమ్మెల్యే స్వయంగా పార చేతబట్టి, తొలగించారు. జేసీబీ సహాయంతో చేపట్టిన వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు. స్థానిక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తానని భరోసా కల్పించారు. అపార్ట్మెంట్ల పార్కింగ్ స్థలాల్లో వరద నీరు నిలిచిపోవడంతో తక్షణమే పరిశుభ్రం చేయాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజా అవసరాలకు తగ్గట్టు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే… తెలుగుదేశం పార్టీ నేతలు వరదలు సైతం రాజకీయ అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆహారం, నీరు, పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నప్పటికీ… తెలుగుదేశం నాయకులు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వ సహాయం అందడం లేదంటూ టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తనతో పాటు, మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సహాయక చర్యలు చేపడుతున్నామని
స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement