Friday, April 19, 2024

కరోనా నియంత్రణలో అంద‌రు భాగస్వాములు కావాలి – మంత్రి మేకపాటి

ఆత్మకూరురూరల్, : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో దాని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరుజిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో కరోనా ఉధృతిపై పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆత్మకూరు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆత్మకూరు ఆర్డిఓ మున్సిపల్ కమిషనర్ లతో ఫోన్ లోనే సంప్రదించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని, వారి ఇబ్బందిని బట్టి వారికి సహాయం అందేలా చూడాలని మంత్రి మేకపాటి కార్యాలయానికి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆత్మకూరులో పడకల సంఖ్య పెంచడం, ఆక్సిజన్ కొరత లేకుండా ప్రయత్నించడం వంటి విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితిని ముందే గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని పెంచుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లా అధికారులు కూడా ఎక్కడ కోవిడ్ కేసులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడికి ప్రత్యేకంగా ప్రజలకు నిస్వార్థ సేవలు అందించే నర్సులను పంపిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవ్వాళ ఆత్మకూరుకు కూడా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆత్మకూరు జిల్లా ఏరియా ఆసుపత్రికి నర్సుల బృందాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాపై పోరాటం చేస్తూ మృతి చెందిన సంగం మండలం లోని చెన్నవరప్పాడుకు చెందిన ఏఎన్ఎం శశికుమారి, ఏఎస్ పేట మండలం ఉపాధిహామి పథకం ఏపీవో కిశోర్ లను కోల్పోవడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.
అధికారులకు అభినందనలు :
మంత్రి మేకపాటి ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా జిల్లా, ఆత్మకూరు అధికారులు ,జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు ఈ విపత్కర సమయంలో అందించవలసిన సేవల కోసం నిర్విరామంగా శ్రమిస్తోంది. ఈ సమయంలో ప్రజల అత్యవసర లను పరిష్కరించే క్రమంలో, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకు రావడంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ప్రజలు కూడా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ 19 నియంత్రణలో సహకరించాలని కోరారు. అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో మంత్రి మేకపాటి కార్యాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి మరొకసారి పిలుపునిచ్చారు. అవాస్తవ సమాచారం వల్ల సాధారణ పౌరులు భయాందోళనకు గురి అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాస్తవ పరిస్థితి అర్థం చేసుకొని ముందుకు సాగాలని మంత్రి ఆదేశించారు.
ఆరోగ్యం మెరుగ్గా ఉంది :
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని మంత్రి మేకపాటి వెల్లడించారు. తనకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాలు, మసీదు ,చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజూ ఎంతోమంది పరామర్శిస్తూ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మంత్రి మేకపాటి. త్వరలోనే పూర్తిగా కోలుకుని నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణ‌కు మరిన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement