Wednesday, April 24, 2024

స‌ర్కార్ బ‌డుల రూపురేఖలు మారుస్తున్న మన ఊరు-మన బడి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడిని నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని మామిళ్ళగూడెంలో రూ.12.49లక్షలు శాంతి నగర్ లో రూ. 1.14కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పేదలకు విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించనున్నమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులతో ఎర్పాటు చేస్తున్నామని అన్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 సర్కార్ బడులలో రూ.7289 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని ప్రైవేటు స్కూల్ బంద్ అయి పిల్లలు అందరూ సర్కార్ స్కూళ్లకు వచ్చే విధంగా సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు.

ఖమ్మం జిల్లాలోనే దాదాపు 426 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి 12 రకాల ప్రధాన అంశాలతో వసతులు కల్పించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలో వసతులు కల్పించి ప్రతి సామాన్యుడికి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమం లో బోధన ప్రారంభించామని ఒకవైపు బోధన, మరోవైపు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పిల్లలు పుస్తక పఠనంతో పాటు నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ పిల్లలకు శానిటేషన్ కిట్స్ ఇవ్వబోతుందని, వారం పది రోజుల్లో ప్రభుత్వం ఇది ప్రారంభించనుందని అన్నారు. మన ఊరు-మన బడి వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయయని, ఇక నుండి మరింత బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక విద్యార్థి పైన తెలంగాణ ప్రభుత్వం 1.25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుందని, విదేశీ విద్యా కోసం వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. స్కూళ్లలో సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల పైన దృష్టి పెట్టాలని, వచ్చే విద్యా సంవత్సరంలో సర్కారు బడులలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే విధంగా సిబ్బంది నాణ్యమైన విద్యాబోధనను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, సుడా చైర్మన్ విజయ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డీఈవో సోమశేఖర్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఎంఈవోలు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement