Friday, March 29, 2024

Lucknow – కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే మ‌రో గ్యాంగ్ స్ట‌ర్ సంజీవ్ దారుణ హ‌త్య …..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్యాంగ్‌స్టర్ సంజీవ్‌ జీవా దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి అతడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. లఖ్‌నవూ సివిల్‌ కోర్టు గది బయట జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మరోవైపు, ఈ ఘటనలో పోలీస్‌ కానిస్టేబుల్‌తో పాటు ఓ బాలిక గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. జీవాపై అనేక క్రిమినల్‌ కేసులు ఉండటంతో ఓ క్రిమినల్‌ కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడిపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడినుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

కాగా, పశ్చిమ యూపీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ సంజీవ్‌ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్‌ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. భాజపా ఎమ్మెల్యే బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ పోలీస్‌ కస్టడీలో హత్యకు గురైన రెండు నెలల్లోనే మరో గ్యాంగ్‌స్టర్‌ హత్యకు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement