Thursday, April 18, 2024

పేదల జీవితాల్లో కంటి వెలుగు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్, ప్రభన్యూస్ బ్యూరో : దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు – భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు – 2 కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల స్త్రీ స్వశక్తి భవన్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అట్టహాసపు ఏర్పాట్ల నడుమ పండుగ వాతావరణంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి స్వయంగా ఈ శిబిరంలో నేత్ర పరీక్ష చేయించుకుని కంటి అద్దాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయం లేదని, ఓట్ల కోణం అసలే లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మతగా మారిన కంటి సమస్యను పారద్రోలాలనే కృత నిశ్చయంతో 2018 లోనే కంటి వెలుగుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తు చేశారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 50 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తే, మూడొంతుల మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారని నిర్ధారణ అయ్యిందని, యాభై లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 7 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపి, రెండు లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం రెండవ విడతలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 12 లక్షల పైచిలుకు మందికి స్క్రీనింగ్ నిర్వహించేందుకు 70 బృందాలను ఏర్పాటు చేశామని, వంద రోజుల పాటు ఈ శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కొనసాగుతాయని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. శారీరక అవయవాలన్నింటిలో అతి ప్రధానమైన కంటి చూపును కోల్పోతే ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. ఏ.ఎన్.ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించుకునేలా చొరవ చూపాలన్నారు. అన్ని వర్గాల వారు భాగస్వాములై కంటి వెలుగును విజయవంతం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగు-2 కార్యక్రమం ద్వారా జిల్లాలో 12 . 30 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా 70 బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. మొదటి విడతలో 31 బృందాలు 160 రోజుల పాటు పని చేశాయని, ప్రస్తుతం వంద రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్ష చేయించుకునే వెసులుబాటు లేనివారికి కంటి వెలుగు శిబిరాలు ఎంతో గొప్ప అవకాశంగా నిలుస్తాయని, వీటిని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, దూర దృష్టికి కంటి అద్దాలు వెంటనే అందించడం జరుగుతుందని, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి కూడా 15 నుండి 20 రోజుల్లోపు వారి ఇళ్లకు వెళ్లి అందజేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. కాగా, ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. నోడల్ అధికారిగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త సంచాలకులు అంబర్ సింగ్ నాయక్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శన్, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement