Friday, March 29, 2024

Telangana | ప్రతి పౌరుడికి అందుబాటులో న్యాయ వ్యవస్థ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్

పెద్దపల్లి (ప్రభా న్యూస్) : న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తనకు తెలుగు భాష పై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విని, ఆయన హిందీ భాష పట్ల ఆశ్చర్యపోవడం జరిగిందని, తెలుగు భాషలో ఇంకా ఆకర్షణీయంగా మాట్లాడేవారు అని తెలిపారు. కోర్టులలో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చేరువగా న్యాయ వ్యవస్థ పని చేయగలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత ప్రాముఖ్యతను వివరించారని అన్నారు. క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో స్థానిక భాష ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు, ప్రజలలో నమ్మకం పెరుగుతాయన్నారు. భాష కేవలం ఇతరులకు కమ్యూనికేట్ చేసే సాధనం మాత్రమేనని, దీనికి సంబంధించి గౌహతిలో జూనియర్ సెలక్షన్ కమిటీలో జరిగిన సంఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

మంచి పరిజ్ఞానం ఉన్న జడ్జిలను తాను ఎంపిక చేసానని తెలిపారు. ముంబై హైకోర్టులో మరాఠీలో మరాఠిలో కోర్టు ప్రోసిడింగ్స్ అందజేస్తే అదనపు లాభాలు కలిగాయని, అదేవిధంగా జిల్లా స్థాయిలో కోర్టులలో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేందుకు అవసరమైన చర్యలు ప్రణాళిక బద్ధంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీనివల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవు తాయని అన్నారు.

- Advertisement -

హైకోర్టు జస్టిస్ పి. నవీన్ రావు పట్ల ఉన్న గౌరవంతో 14 మంది హైకోర్టు జడ్జిలు వచ్చి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించడంతో మరింత శోభ సంతరించుకుందన్నారు. ‌పెద్దపల్లి జిల్లా చాలా చారిత్రాత్మకమైన జిల్లా అని, రెండో శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాలు, ఓదెల మల్లికార్జున స్వామి, కమాన్ పూర్ ఆది వరాహస్వామి దేవాలయాలు, రామగిరి ఖిల్లా వంటి ప్రాంతాలు ఉన్నాయన్నారు.

పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 16 వేల 465 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నా మని , న్యాయవాదులు, ప్రజలు సైతం సహకరించాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని తెలిపారు.

కార్యక్రమం లో రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, పెద్దపల్లి జిల్లా న్యాయమూర్తి నాగరాజు, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రవణ్ కుమార్ తోపాటు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement