Thursday, April 25, 2024

ఏపీలో డిసెంబర్‌ నాటికల్లా భూసర్వేలు పూర్తి.. అత్యాధునిక డ్రోన్‌లు ద్వారా సర్వేలు

గుంటూరు, ప్రభన్యూస్‌బ్యూరో: ఏపీలో డిసెంబర్‌ నాటికల్లా భూ సర్వేలు పూర్తి చేస్తామని, అనుభవం ఉన్న సిబ్బందిని నియమించామని రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రన్స్‌, స్టాంప్సు, గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అత్యాధునిక డ్రోన్‌లు ద్వారా సర్వేలు త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్ల్లడించారు. 1956లో జరిగిన భూ సర్వే తర్వాత ఇంతవరకు సర్వేలు చేయలేదని, సర్వే జరగనందువల్ల గ్రామాల్లో గొడవలకు దారి తీస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 21 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. ఓట్లు కోసం సర్వే చేయటంలేదని, ప్రజా ప్రయోజనాల కోసమే చేస్తున్నామని చెప్పారు. ఎల్‌కేజీ నుంచి ఉన్నత విద్య వరకు మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జగనన్నలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని మంత్రి దర్మాన ప్రసాదరావు అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏమీ చేయలేని ప్రభుత్వాలకు సమస్యలు కనిపించవని అన్నారు. గుంటూరు కాలువ ఆధునికీకరణ కోసం సీఎం జగన్‌ అంగీకారం తెలిపారని మంత్రి ధర్మాన తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ మెరుగవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక చట్టం చేసిందన్నారు. శివరామకృష్ణ కమిటి కూడా సూచనలు చేసిందని, దీంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన చట్టం, కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారని, ముఖ్యమంత్రి చెప్పిన దానికి ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి దర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

ఏపీ రాజధాని అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు చేపట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడతాయని, అందుకే మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement