Thursday, April 25, 2024

ఏపీలో సాధారణ కూలీ కుటుంబానికి రూ.1.48 లక్షల కరెంట్ బిల్లు

ఏపీలో విద్యుత్ అధికారుల పనితీరుకు ఇదొక నిదర్శనం అని చెప్పాలి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప అనే సాధారణ కూలీ కుటుంబానికి కరెంట్ అధికారులు షాకిచ్చారు. ప్రతిరోజూ పనికెళ్తే తప్ప పర్వతప్ప కుటుంబానికి పూట గడవదు. అలాంటి కుటుంబానికి నెలనెలా రూ.200 నుంచి రూ.300 దాకా వచ్చే కరెంట్ బిల్లు.. ఇటీవల ఏకంగా రూ.1,48,371 వచ్చింది. ఆ బిల్లు చూసిన పర్వతప్ప కలవరపాటుకు గురయ్యాడు. విచిత్రం ఏంటంటే అతడికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ చేదోడుగా ఉంటోంది. ఇంట్లో ఓ టీవీ.. ఫ్యాన్.. మూడు కరెంట్ బుగ్గలు తప్ప ఇంకేమీ లేవు.

అయితే ఈ విషయంపై విద్యుత్ సిబ్బందిని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. బిల్లును రూ.56,399కు తగ్గించారు తప్పితే.. కారణాలు మాత్రం చెప్పలేదు. అంత బిల్లు కట్టలేమని పర్వతప్ప మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. అతడొక్కడికే కాదు.. ఆ గ్రామంలోని మరికొందరికీ కరెంట్ బిల్లులు భారీగానే పడ్డాయి. బండయ్య అనే వ్యక్తికి ఒకసారి రూ.78,167, ఇంకోసారి రూ.16,251 బిల్లులు వచ్చాయి. దీనిపై విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు లేదా బిల్లు తీసేటప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల ఇంత ఎక్కువ బిల్లులు వచ్చి ఉంటాయని చెప్పారు. మీటర్లలో ఏమైనా సమస్యలున్నాయేమో చూసి వారి బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో రోడ్లు బాగుచేయాలంటూ జనసైనికుల ఉద్యమం

Advertisement

తాజా వార్తలు

Advertisement