Thursday, April 25, 2024

హైదరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్ ఇచ్చిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నగర ప్రజాప్రతినిధులను, సీనియర్ నాయకులను కోరారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జి లతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్థానిక కమిటీల నిర్మాణం పూర్తయ్యిందని, ఇదే స్ఫూర్తితో నగరంలోనూ డివిజన్ కమిటీల నిర్మాణం సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసుకున్న నగర ప్రత్యేక సమావేశంలో చర్చించిన విధంగా, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో పార్టీని అజేయమైన శక్తిగా మార్చేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని, ఈ విషయాన్ని గుర్తించి, ఈ కార్యక్రమాల కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. నగరంలోని కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ కోరారు. రానున్న పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి లను ఇంచార్జి గా నియమించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సమావేశంలో నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీ గార్లతో పాటు పార్టీ హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement