Thursday, March 28, 2024

పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌కు కేసీఆర్ భ‌రోసా… అన్ని విధాలా ఆదుకుంటామ‌ని హామీ..

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా పంటల నష్టాలపై సంబంధిత రైతులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తమకు జరిగిన పంట నష్టాలపై సీఎం కెసిఆర్ కు రైతులు వివరించారు. అలాగే వాన పడిన కొద్ది గంటల్లోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి రైతులను ఓదార్చినట్లు సిఎం కెసిఆర్ కు అన్నదాతలు తెలిపారు. పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతోపాటు సీఎం కెసిఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. అక్కడే పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, ఫోటో ఎగ్జిబిషన్ ను తిల‌కించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదిక మీద నుండి సీఎం కేసీఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు. పంటల నష్టాలకు ఎక్కడైనా రూ.3 వేలే ఇస్తారు, నేను హైదరాబాద్ నుండే ఈ ప్రకటన చేయవచ్చు కానీ, నేను స్వయంగా పంటల నష్టాలు చూడాలనుకున్నాను, రైతులను ఓదార్చాలనుకున్నాను అన్నారు. రైతులతో మాట్లాడాలని భావించాను కాబ‌ట్టే ఇక్క‌డి వచ్చాను అన్నారు.

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. నేను వ్యవసాయం చేస్తాను, మంత్రి నిరంజన్ రెడ్డి, దయాకర్ రావులు కూడా వ్యవయం చేస్తున్నారు. స్వయంగా మేమంతా రైతులం కాబట్టి వ్యవసాయాన్ని కిందికి పడనీయవద్దు, వ్యవసాయాన్ని ఇగ వెనక్కి పోనీయవద్దు.. ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి.. అందుకే మేమంతా వచ్చాం అన్నారు. మీకు ధైర్యం చెప్పడానికే వచ్చినాం అన్నారు. మునపటిలాగా అగో అంటే ఆరు నెలలకు గాకుండా… దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాకుండా మీ నష్ట పరిహారాన్ని తొందరగానే పంపింస్తాం అన్నారు. కౌలుకు తీసుకున్న రైతులను కూడా ఆదుకోవాల‌ని, ఈ ప్రభుత్వం తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుంద‌న్నారు. రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాల‌న్నారు. రైతులే దయ తలచి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. కలెక్టర్లు రైతులను, కౌలు రైతులను పిలిచి మాట్లడతారు. రైతులు పొందే పరిహారంలోనే ఎంతో కొంత కౌలు రైతులకు కూడా అందేవిధంగా చూస్తే బాగుంటుంద‌న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ రాష్ట్రమే అన్నారు. తెలంగాణ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దు, నిరాశ పడొద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషన్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement