Thursday, April 25, 2024

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి
కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.
వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, కంకణ భట్టార్
బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్ స్పెక్ట‌ర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement