Thursday, April 25, 2024

ప్రేమ పేరుతో మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..!

ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫిల్మ్ నగర్ లో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడితో కలిసి గత మూడు నెలలుగా ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటోంది. అయితే కిరణ్ మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయం అనురాధకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉండడం, అతడు మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన అనురాధ ఆత్మహత్య చేసుకుంది.

ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహం స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అనురాధ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

అనురాధ మృతితో గాజులరామారాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అనురాధకు తెలియకుండా కిరణ్‌ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఇదే విషయంపై నిలదీయడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని చెబుతున్నారు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకే అనురాధ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 23 వేల మందికి కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement