Friday, April 26, 2024

అంగన్‌ వాడీల్లో కొలువుల జాతర.. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అంగన్‌ వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే ఖాళీలను రాష్ట్రాల వారీగా గుర్తించింది. అంతేకాకుండా పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్‌వాడీ నియామకాలకు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5,905 ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది నాలుగు వేలకు పైగా అంగన్‌ వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో భారీ రిక్రూట్‌మెంట్‌ కు ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1468 అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మిని అంగన్‌వాడీ వర్కర్ల నియామకాన్ని చేపట్టనున్నారు. అయితే హెల్పర్‌ పోస్టులను మాత్రం భారీగా భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4007 హెల్ఫర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ను అతిత్వరలో విడుదలచేయనుంది.

- Advertisement -

నాలుగు జిల్లాల్లో మొదలైన నియామకాలు..

అంగన్‌వాడీ నియామకాల ప్రక్రియ రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేయడంతో నియామక ప్రక్రియ సాగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కొత్తగా విలీనం చేసిన ప్రాజెక్టుల ఆధారంగా నియామక ప్రక్రియను నిర్వహించనున్నారు. ప్రస్తుతం కడప , అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో 500లకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే అభ్యర్దులను ఎంపిక చేసి నియామక ఆదేశాలను జారీ చేయనున్నారు.

పది పాసైతే చాలు..

అంగన్‌వాడీ వర్కర్ల నియామకానికి సంబంధించిన విద్యా అర్హతల ల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే పదోవ తరగతి పాసైతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్దుల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 11,500 వేతనం మినీ అంగన్‌వాడీలకు రూ.7,000, హెల్ఫర్లకు రూ. 7,000 గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రస్తుతం భ ర్తీ చేయనున్న అంగన్‌ వాడీ వర్కర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల్లో విద్యా వ్యవస్ధ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారితో బోధన సాగించేందుకు నిర్ణయం తీసుకొంది.

ఎంపిక విధానం ఇలా..

అంగన్‌ వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్దుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం వంద మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో పదోవ తరగతి ఉత్తీర్ణులైన వారికి 50 మార్కులు , ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు , వితంతువులకు 5 మార్కులు , అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్‌ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement