Tuesday, April 23, 2024

5వ తేదీన జనసేన విస్తృతస్థాయి సమావేశం.. మంగళగిరికి రానున్న పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతోపాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల ఐదో తేదీన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది.

పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొనే ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, విభాగాల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కోర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం, పెరిగిన విద్యుత్‌ చార్జీలు, రైతులు వ్యవసాయ స్థితిగతులు, వచ్చే కొద్ది నెలలలో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement