Friday, March 29, 2024

జూన్‌ 15 నుంచి జన్‌ జాగరణ్‌, అక్టోబర్‌ 2 నుంచి ‘భారత్‌ జోడో’ యాత్ర.. సోనియాగాంధీ ప్రకటన

”మేము అధిగమిస్తాం, మేము అధిగమిస్తా, మేము అధిగమిస్తాం.. అదే మా సంకల్పం” అని ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విస్పష్ట ప్రకటన చేశారు. కాంగ్రెస్‌కు కొత్త ఉషోదయం రానుందని ఉద్ఘాటించారు. పార్టీ బలోపేతం కోసం దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ”భారత్‌ జోడో” యాత్ర పేరుతో గాంధీ జయంతి రోజు అక్టోబర్‌ 2 నుంచి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేయనున్నట్లు సోనియా ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీ నేతలంతా పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో జూన్‌ 15 నుంచి కాంగ్రెస్‌ రెండో విడత ”జన జాగరణ యాత్ర” ప్రారంభించాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్థిక సమస్యలను ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధిని నాశనం చేస్తున్న భరించలేని ధరల పెరుగుదలను ఎత్తిచూపుతూ ప్రచారం చేయాలని సూచించారు. ”ఒత్తిడిలో ఉన్న సామాజిక సామరస్య బంధాలను పటిష్టం చేసేందుకు, దాడికి గురవుతున్న రాజ్యాంగ పునాది విలువలను కాపాడేందుకు, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తి చూపేందుకు ఈ ‘భారత్‌ జోడో’ యాత్ర సాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో వివిధ కమిటీలు చర్చించి, సూచించిన సంస్కరణల ప్రక్రియను మొదలు పెట్టేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించడంతోపాటు, పార్టీ సంస్థాగతంగా పటిష్ట నిర్మాణం, పార్టీ పదవుల నియామకాలు తదితర అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తుందని వివరించారు. రెండు మూడు రోజుల్లో టాస్క్‌ఫోర్స్‌పై ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ”రాజకీయ సమస్యలు, సవాళ్లపై చర్చించడానికి వర్కింగ్‌ కమిటీ నుంచి ఒక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సలహా మండలి క్రమం తప్పకుండా సమావేశమై రాజకీయ అంశాలపై పార్టీ ప్రెసిడెంట్‌కు తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. సీనియర్‌ నేతల అపారమైన అనుభవాన్ని పొందడంలో కూడా ఈ సలహా మండలి సహాయకారిగా ఉంటుంది. సంస్థాగత మార్పులకు సంబంధించిన నివేదిక తక్షణమే అమల్లోకి రావాల్సి ఉంది.

ఆ కమిటీ ఇచ్చిన వివరణాత్మక సిఫార్సులు స్వీకరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటాం” అని సోనియాగాంధీ వివరించారు. ”చింతన్‌శిబిర్‌ ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగింది. నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి నేతలకు అవకాశం వచ్చింది. అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించడానికి సమావేశాలు ఉపయోగపడ్డాయి. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమై చర్చలు జరిపేందుకు చింతన్‌ శిబిర్‌ ఉపయోగపడింది. ఆరు కమిటీల చర్చల్లో హాజరై నేను కూడా పలు సూచనలు చేశాను. పలువరు చేసిన ప్రతిపాదనలను తెలుసుకోగలిగాను. మూడు రోజులపాటు ఇంతమంది నేతలతో సమయం వెచ్చించడం… నా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది” అని సోనియాగాంధీ పేర్కొన్నారు. జనతా దర్బార్‌ పేరుతో బహిరంగ సభలు కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టింది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తాన్ని కవర్‌ చేసేలా పాదయాత్ర కొనసాగనుంది. ప్రజలకు చేరువవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారు. ఈ మహాపాదయాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ 90 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌ ‘చింతన్‌ శిబిర్‌’లో భారీగా పాదయాత్ర నిర్వహించాలని దిగ్విజయ్‌ సింగ్‌ నేతృత్వంలో కమిటీ ప్రతిపాదన చేసింది. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను లేవనెత్తేలా ఈ యాత్ర ఉండాలని కమిటీ సూచించింది. ఏడాదిపాటు సాగే ఈ మహాపాదయాత్రలో రాహుల్‌గాంధీతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు కూడా మధ్య మధ్యలో చేరాలని సూచించారు. యాత్రకు సంబంధించి దిగ్విజయ్‌ సింగ్‌ పూర్తిస్థాయిలో ఒక ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై పార్టీ అగ్రనేతలు లోతైన చర్చ కూడా జరిపారు. దీంతో ఈ యాత్ర ఖాయమైంది. ఇలాంటి ప్రతిపాదననే యూత్‌ కాంగ్రెస్‌ కమిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం. పాదయాత్రలో భాగంగా అవసరమైన చోట్ల ”జనతా దర్బార్‌” పేరుతో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement