Thursday, April 25, 2024

పథకాలను పేదలకు చేర్చాల్సింది అధికారులే.. ఐఐపీఏ 68వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలను అరికట్టాల్సిన తక్షణావసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ లోపాలను అరికట్టడం ద్వారా ప్రజలకోసం ఉద్దేశించిన పథకాలను సమర్థవంతంగా వారికి అందించాల్సిన బాధ్యత పాలనాధికారులపై ఉందని ఆయన అన్నారు. అప్పుడే సమాజంలోని అన్నివర్గాలకు సమన్యాయం సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీలోని ఐఐపీఏ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) 68వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాకేంద్రిత సుపరిపాలన కొనసాగాలంటే ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పాలనాధికారులు సమగ్రత, పారదర్శకత, నిజాయితీ, క్రియాశీలత తదితర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేలా ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని వెంకయ్య నాయుడు సూచించారు.

భారతదేశ అభివృద్ధి పథంలో మన సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు పాలనాధికారులు సిద్ధంగా ఉండాలని, భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న అత్యుత్తమ పద్ధతులను అర్థం చేసుకుని మన సమాజంలోని వారికి ఆ పద్ధతుల్లో లబ్ధి చేకూర్చేందుకు పనిచేయాలని సూచించారు. భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో మన దేశం సాధిస్తున్న ప్రగతిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ‘ఆత్మనిర్భర భారత్’ నినాదంతో సమగ్రాభివృద్ధి దిశగా మన దేశం దూసుకెళ్తున్న విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సామాజిక-ఆర్థిక, సాధికార సమాజ నిర్మాణం లక్ష్యంగా జరుగుతున్న ఈ మహత్కార్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది ఓ మహోన్నత వ్యక్తిత్వమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. సమృద్ధి, ఐకమత్య, బలమైన భారతదేశ నిర్మాణం కోసం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టి, స్వతంత్ర భారత ప్రథమ రాష్ట్రపతిగా ఎదిగిన వారి జీవితం స్ఫూర్తివంతమైనదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఛత్తీస్‌గడ్ మాజీ గవర్నర్ శేఖర్ దత్, ఐఐపీఏ డీజీ, సభ్యకార్యదర్శి ఎస్ఎన్ త్రిపాఠీ, ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావుతో పాటు ఐఐపీఏ బోధనా సిబ్బంది, ఉన్నతాధికారులు, నైపుణ్య శిక్షణార్థులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement