హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫ్యామిలీ పెన్షన్పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ వినతి మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తాజా ప్రభుత్వ ఫ్యామిలీ, ఇన్వాలిడ్ పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వుల నిర్ణయంతో ఇప్పటికిప్పుడు 1500 కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరీకి మార్గం సుగమమైంది. ఈ మార్గదర్శకాలద్వారా అర్హులైన ఉద్యోగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కల్పించిన ఫ్యామిలీ పెన్షన్ ప్యోజనం పొందుతారని ఆయన వెల్లడించారు.
తాజా ఉత్తర్వుల్లో ఇప్పటివరకు స్పష్టతలేని చనిపోయిన ఉద్యోగినుంచి సీపీఎస్ డిడక్షన్ రికవరీ చేసిన ఉద్యోగి, ప్రాణ్కార్డు లేని, సీపీఎస్ రికవరీలేని, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులు రాకమునుపే ప్రాన్నుంచి తొలగించినవారికి స్పష్టమైన మార్గదర్శాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉత్తర్వులతో వారందరికీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరీకి అవకాశం కల్గింది. సర్వీస్లో ఉన్న ఉద్యోగి తప్పిపోయిన సందర్భాల్లో మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర సీపీఎస్ నోడల్ ఆఫీసర్ ప్రభుత్వానికి నివేదించారని స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి, మానవతా హృదయంతో స్పందించిన సీఎం కేసీఆర్కు, ట్రెజరీ డైరెక్టర్ కెఎస్ఆర్సీ మూర్తిలకు సీపీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.