Saturday, April 20, 2024

సకల హంగులతో సమీకృత మార్కెట్లు : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా నగరంలోని వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలసి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి 31లోగా నగర వ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు సమీకృత మార్కెట్లను ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరడంతో పాటు.. ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం 40 కోట్లతో నగరానికి నాలుగు వైపులా సమీకృత మార్కెట్లు సకహంగులతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. సమీకృత మార్కెట్ల నిర్మాణంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నరని అన్నారు. కరీంనగర్‌ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించే బల్దియా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని.. పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఒకేచోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలల వీటిని నిర్మిస్తోందని అన్నారు. ఒక్కో దానికి రూ.10 కోట్ల నిధులతో అత్యాధునిక హక్కులతో నిర్మిస్తుందని.. మార్కెట్కు వచ్చే ప్రజలకు సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో పాటు మంచినీటి వసతులు కలిపిస్తున్నామని అన్నారు. నగరవ్యాప్తంగా రోడ్లమీద 3000 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారందరికీ సమీకృత మార్కెట్లలో అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. క‌రీంనగర్‌ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిపడా మార్కెట్లు లేక ప్రధానరోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారని, మాంసాన్ని సైతం అపరిశుభ్రకరమై వాతావరణంలో అమ్ముతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయన్నారు. రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయనిగ్రహించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచనల మేరకు నగరంలో 40 కోట్లతో సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement