Wednesday, April 24, 2024

తెలంగాణాలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు.. ఎఫ్‌సీఐ అధికారులకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణాలోని అన్ని రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ అధికారులను ఆదేశించినట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ ధాన్యం సంచులు ఏమయ్యాయో స్పష్టత కావాలని, ఆయా రైస్ మిల్లర్లపై రాష్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. నిబంధనల ప్రకారం మిల్లుల్లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో అంత ఉండటం లేదని చెప్పుకొచ్చారు. రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఓ నాయకుడు తనకు లేఖ రాశారని గుర్తు చేశారు. వాస్తవానికి రైస్ మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని కిషన్‌రెడ్డి వివరించారు.

కనీసం కోటి గోనె బస్తాల్లేవు…

40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ పంపిస్తామని ఈ నెల 14న తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కేంద్రానికి లేఖ రాయగా వరుస సెలవులు ఉన్నా వెంటనే స్పందించి బదులిచ్చామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి ఇంతవరకు రైతులు, మిల్లర్లకు స్పష్టత లేదని అన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న బియ్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లేమీ చేయలేదని చెప్పారు. గోనె సంచుల కొరత, తూకం వేసే పరికరాలు లేవు, వర్షం వస్తే తడవకుండా కాపాడే టార్పాలిన్ కవర్లు లేవన్న కేంద్రమంత్రి, వీటన్నిటినీ జనవరి నుంచే సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 15 కోట్ల గోనె బస్తాలు కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వద్ద కనీసం కోటి బస్తాలు కూడా లేవని వెల్లడించారు. గోనె సంచులు లేకుండా బియ్యాన్ని తట్టల్లో పడతారా? ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం సేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ తొండాట..

ధాన్యం సేకరణకు సంబంధించి ఫిబ్రవరి నుంచి కేంద్రం అనేక సమావేశాలు నిర్వహించినా సరే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఉల్టా తమ మీదే పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేస్తూ వచ్చిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ జాప్యం కారణంగా రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందని, అందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై అనవసర రాద్ధాంతం చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు. దేశమంతటా ఒకే విధానం ఉందని నొక్కి చెప్పిన కేంద్రమంత్రి, ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని అన్ని రాష్ట్రాలను ఒప్పించిన విషయం గుర్తు చేశారు. ముడిబియ్యం విషయంలో కేంద్రం మొదట్నుంచీ స్పష్టమైన వైఖరితో ఉందని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తొండాట ఆడుతూ, సీఎం ఢిల్లీ వచ్చి మరీ ధర్నాలు చేశారని మండిపడ్డారు. రైతులకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశంతో తాము వ్యవహరిస్తుంటే సీఎం మొండికేసి కాలయాపని చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నో రాష్ట్రాల్లో తమకు రైతుల మద్దతు ఉందని, కేసీఆర్ కుటుంబ సర్టిఫికెట్ తమకు అక్కర్లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో ఓడిన తర్వాత బీజేపీ మీద అనేక రకాలుగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

బయో ఫ్యూయల్‌తో రైతులు, దేశానికి ప్రయోజనం..

వడ్లను మిల్లు పట్టించగా వచ్చే నూకలను సద్వినియోగం చేసుకోవచ్చని కిషన్‌రెడ్డి వివరించారు. నూకల నుంచి బయో ఫ్యూయల్ తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయమని కేంద్రం గతంలోనే కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బయో ప్యూయల్ తయారీపై జాతీయ విధానాన్ని 2018లోనే కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలందిస్తుందని రాష్ట్ర స్థాయిలో బయో ఫ్యూయల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు బయో ఫ్యూయల్ బోర్డులను ఏర్పాటు చేసుకున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం మాత్రం తమ సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. పాడైన ఆహార దినుసులతో బయో ఫ్యూయల్ తయారీ వల్ల రైతులు, దేశానికి ప్రయోజనకరమన్న ఆయన, బోర్డులను సరిగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో నూకలు లేని రకం బియ్యాన్ని ఎలా సాగు చేస్తున్నారో, అదే విధానాన్ని ఇతర ప్రాంతాల్లో చేపట్టినట్టయితే 90శాతం సమస్య పరిష్కారమైనట్టేనని అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సాగు విధానాలనూ అవలంభిస్తే రైతులకు మంచిదని సూచించారు.

గవర్నర్ మార్పు అవసరమేంటి?

తెలంగాణా గవర్నర్‌ తమిళిసైకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి మద్దతు ఉందని గవర్నర్‌ విషయంలో కేంద్ర వైఖరిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బదిలీ చేసే అవకాశముందా అని అడగ్గా గవర్నర్ మార్పు అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ సమర్పించిన నివేదికలపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు.

ఫోర్టిఫైడ్ రైస్‌పై స్పందనే లేదు..

పోషకాలు జోడించిన ఫోర్టిఫైడ్ రైస్ పథకం విషయంలోనూ తెలంగాణా ప్రభుత్వం స్పందించట్లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అన్ని రైస్ మిల్లుల్లో గ్లెండర్ అనే వస్తువును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేయవచ్చని అన్నారు. పేదలు, గర్భిణులు, పిల్లలకు ఎంతో ఉపయోగపడే ఈ రైస్‌ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, ఉద్యోగులు, ప్రజలకు ఆర్థిక సాయం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీలో ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలివ్వట్లేదని, ధాన్యం కొనుగోళ్ళకు కావలసిన కమిషన్ల కోసం కూడా అప్పులు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి 22వ తేదీన ఖమ్మం వెళ్తున్నానని కిషన్‌రెడ్డి చెప్పారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement