Friday, March 29, 2024

భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ కరోనా పాజిటివ్

కరోనా ఇప్పట్లో మనల్ని విడిచి వెళ్లేలా లేదు. నిత్యం రూపం మార్చుకుంటున్న ఈ మహమ్మారితో సహజీవనం తప్పేట్లు లేదు. భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి మరోసారి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. త్రిస్సూర్ వాసి అయిన ఆమె చైనాలో వైద్య విద్య అభ్యసిస్తూ కరోనా సంక్షోభం కారణంగా గత ఏడాది జనవరిలో స్నేహితులతో పాటు భారత్‌కు తిరిగొచ్చారు. ఈ క్రమంలో ఆమె దేశంలో అడుగు పెట్టాక పాజిటివ్ అని తేలింది. అయితే ఆ యువతి తాజాగా మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆమెలో కరోనా లక్షణాలు లేవని కూడా వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్న సదరు విద్యార్థిని ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆమె కరోనా టీకా తొలి డోసు కూడా తీసుకుందని పేర్కొన్నారు.

కాగా తొలిసారి కరోనా బారిన పడ్డ సందర్భంలో ఆమె నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో గడపాల్సి వచ్చింది. ఆమెతో పాటూ వూహాన్ నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరు స్నేహితులు కూడా కొంతకాలం తరువాత కరోనా కాటుకు గురైయ్యారు. ఇక భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గతంలో జరిపిన అధ్యయనంలో రీ ఇన్ఫెక్షన్ రేటు (మరోమారు కరోనా బారినపడటం) 4.5 శాతంగా తేలింది. గతేడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐసీఎంఆర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

ఈ వార్త కూడా చదవండి: రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ప్రమాదకరం

Advertisement

తాజా వార్తలు

Advertisement