Thursday, April 25, 2024

అమెరికా ఎన్నికల్లో భారతీయం.. నలుగురు ఇండో-అమెరికన్ల గెలుపు

అమెరికా కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. అధికార డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి నలుగురు గెలుపొందారు. థానేదార్‌, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ యుఎస్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. బుధవారం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఖన్నా, కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ వరుసగా నాల్గవసారి ఎన్నికల్లో పోటీచేశారు. భారత సంతతి నేతల్లో అత్యంత సీనియర్‌ అయిన అమీబెరా కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభకు ఆరవసారి పోటీ చేశారు. ఆ స్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది.

మరోవైపు టెక్సాస్‌ నుంచి పోటీచేసిన సందీప్‌ శ్రీవాస్తవ ఓటమి పాలయ్యారు. మాజీ కోలిన్‌ కౌంటీ న్యాయమూర్తి కీత్‌ సెల్స్‌ చేతిలో పరాజయం చెందారు. 33.19 కోట్ల అమెరికన్‌ జనాభాలో భారత సంతతి పౌరుల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. అయినా అగ్రరాజ్యంలో కీలక బాధ్యతల్లోకి దూసుకెళ్లడంలో ముందంజలో ఉంటున్నారు.

రాజకీయ నాయకుడిగా మారిన భారతీయ-అమెరికన్‌ వ్యవస్థాపకుడు, డెమొక్రాట్‌ నేత థానేదార్‌ మిచిగాన్‌ నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి మార్టెల్‌ బివింగ్స్‌ను ఓడించారు. 67 ఏళ్ల థానెదార్‌ ప్రస్తుతం మిచిగాన్‌ హౌస్‌లో మూడవ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement