Friday, April 19, 2024

లంకతో ధనాధన్‌.. నేటి నుంచి టీ20 సిరీస్

శ్రీలంకతో నేటీ నుంచి భారత్ మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ ఆరంభకానుంది. వన్డే సిరీస్ టీమిండియా 2-1 తో గెలిచిన నేపథ్యంలో టీ20 సిరీస్ మనోళ్లకు గట్టి సవాల్ విసిరేందుకు సిద్దమయింది ఆతిథ్య టీమ్. బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకొని టి20 సిరీస్‌లో శుభారంభం చేసేందుకు శిఖర్‌ ధావన్‌ బృందం సిద్ధమైంది. ఇక టీమిండియా జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా ధావన్, పృథ్వీ షా కొనసాగనున్నారు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్‌ యాదవ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బాధ్యతను మోయనున్నారు. ఆల్‌రౌండర్లుగా పాండ్యా బ్రదర్స్‌… కృనాల్, హార్దిక్‌ బరిలోకి దిగుతారు. దాంతో మనీశ్‌ పాండే బెంచ్‌కే పరిమతం అయ్యే అవకాశం ఉంది. చివరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న భువనేశ్వర్, దీపక్‌చహర్‌ మళ్లీ జట్టులోకి రానున్నారు. స్పిన్నర్లుగా వరుణ్‌ చక్రవర్తి, చహల్‌/రాహుల్‌ చహర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇక లంక విషయానికి వస్తే దసున్‌ షనక నాయకత్వంలోని శ్రీలంక నిలకడగా రాణిస్తోంది. రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన ఆ జట్టు… మూడో వన్డేలో భారత్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టి20 సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. అవిష్క ఫెర్నాండో సూపర్‌ ఫామ్‌లో ఉండటం… గత మ్యాచ్‌తో రాజపక్స కూడా టచ్‌లోకి రావడం ఆ జట్టుకు సానుకూల అంశాలు.

వన్డే సిరీస్‌కు వేదికైన ప్రేమదాస స్టేడియంలోనే టి20 సిరీస్‌ కూడా జరగనుంది. పిచ్‌ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సూచన ఉంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉంది.

తుది జట్టు అంచనా: ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చహర్, భువనేశ్వర్, వరుణ్‌ చక్రవర్తి, చహల్‌/రాహుల్‌ చహర్‌.

ఇది కూడా చదవండి : పాత్రలను పరిచయం చేసిన సంతోష్ శోభన్ ‘మంచిరోజులు వచ్చాయి’

Advertisement

తాజా వార్తలు

Advertisement