Thursday, April 18, 2024

నాలుగో వన్డేలోనూ భారత్‌ ఓటమి.. 4.0తో ఆధిక్యంలో న్యూజిలాండ్‌..

న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న మిథాలీరాజ్‌ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్‌జట్టు పరాజయాల పరంపరను కొనసాగుతోంది. కివీస్‌తో ఏకైక టీ20లోనూ ఓడిన మిథాలీసేన ఆ తర్వాత 5మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా నాలుగోసారి ఓటమిపాలైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌ 4-0తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మంగళవారం భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన నాలుగో వన్డేలో టాస్‌ గెలిచిన భారతజట్టు బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహానించింది. వర్షం కారణంగా ఈ వన్డే మ్యాచ్‌ను 20ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారత్‌పై 63పరుగులు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 191పరుగులు చేసింది. అమెలియా కెర్‌ 33బంతుల్లో 11ఫోర్లు, ఓ సిక్స్‌తో 68పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అర్ధశతకం సాధించి అజేయంగా నిలిచిన కెర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. కెర్‌కు తోడుగా ఓపెనింగ్‌ జోడీ డివైన్‌ (32), బేట్స్‌ (41), శాటర్త్‌ (32) సహకరించంతో న్యూజిలాండ్‌ 191పరుగులు స్కోరు నమోదు చేసింది.

భారత బౌలర్లలో రేణుకాసింగ్‌ 2వికెట్లు, మేఘనాసింగ్‌, గైకాడ్‌, దీప్తీశర్మ తలో వికెట్‌ తీశారు. అనంతరం న్యూజిలాండ్‌ నిర్దేశించిన 191పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారతజట్టు విఫలమైంది. 17.5ఓవర్లలో 128పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా టాపార్డర్‌ స్వల్పస్కోరుకే కుప్పకూలడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. స్మృతి మంధాన (13) నిరాశపరచగా షెఫాలీవర్మ (0), యస్తికా బాటియా (0) డకౌట్‌ అయ్యారు. పూజ (4) తరగానే ఔటవగా కెప్టెన్‌ మిథాలీరాజ్‌..వికెట్‌కీపర్‌ రిచాఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆదుకునేందుకు ప్రయత్నించింది.

మిథాలీ 28బంతుల్లో 2ఫోర్లు, ఓ సిక్స్‌తో 30పరుగులు చేసి జెస్‌కెర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయింది. రిచాఘోష్‌ 29బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లతో 52పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో మెరిసింది. ఈ క్రమంలో వన్డేల్లో వేగవంతమైన హాఫ్‌సెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. మిగిలిన బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దీప్తీశర్మ (9), స్నేహ్‌రాణా (9), మేఘనాసింగ్‌ (0), రేణుకాసింగ్‌ (0), రాజేశ్వరి గైకాడ్‌ (4) నిరాశపరిచారు. దీంతో భారత్‌ వరుసగా నాలుగో వన్డేలోనూ ఓటమిపాలైంది. కాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్‌ దీప్తీశర్మ 18వ స్థానంలో నిలిచింది. మంగళవారం వెలువడిన ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ మిథాలీరాజ్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి, రెండో వన్డేల్లో మిథాలీరాజ్‌ హాఫ్‌సెంచరీలుతో ఆకట్టుకుంది. టీమిండియా వెటరన్‌ పేసర్‌ జులన్‌గోస్వామి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగోస్థానంలో నిలిచి టాప్‌-10లో నిలిచిన ఏకైక భారత బౌలర్‌గా నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement