Friday, April 19, 2024

సెమీస్‌ బెర్త్‌ లక్ష్యంగా బరిలోకి భారత్‌.. రేపు జింబాబ్వేతో కీలక పోరు

టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేతో రోహిత్‌ సేన ఆదివారంనాడు తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఈ కీలక మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి సెమీఫైనల్లో ఘనంగా అడుగుపెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ పేవరేట్‌గా కనిపిస్తున్నా జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే షాక్‌ తప్పకపోవచ్చు. టాప్‌ ఆర్డర్‌ భీకర ఫామ్‌కు తోడు బౌలర్లు రాణిస్తుండడంతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పాకిస్తాన్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చిన జింబాబ్వే మరోసారి అదే ఫలితం పునరావృతం చేసి టోర్నీని ముగించాలని చేస్తోంది.

విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ ఫామ్‌కు తోడు రాహుల్‌ కూడా ఫామ్‌ అందుకోవడం టీమిండియాకు కలిసి రానుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో 74 పరుగులే చేసిన సారథి రోహిత్‌ శర్మ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌లతో కూడిన టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో దీపక్‌ హుడాకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశముంది. కార్తీక్‌ స్థానంలో పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌లు పెరుగుతున్న దృష్ట్యా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

ఈ మెగా టోర్నమెంట్‌లో జింబాబ్వే స్థాయికి మించి రాణిస్తోంది. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన జింబాబ్వే, బంగ్లాదేశ్‌ను ఓడించినంత పని చేసింది. రెగిస్‌ చకబ్వా సారథ్యంలోని జట్టు అద్భుతంగా ఆడుతోంది. బౌలింగ్‌లో జింబాబ్వే మెరుగ్గా రాణిస్తోంది. పాక్‌పై 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా జింబాబ్వే కాపాడుకుంది. మరి పొడవైన జింబాబ్వే బౌలర్లు ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్లకు ఏమాత్రం సవాల్‌ విసురుతారో చూడాలి.

బ్యాటింగ్‌ విభాగంలో జింబాబ్వే బలహీనంగా కనిపిస్తోంది. పాక్‌లో జన్మించిన సికిందర్‌ రాజా ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడిపై జింబాబ్వే భారీ ఆశలు పెట్టుకుంది. సికిందర్‌ రాజాతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మాజీ హెచ్చరిస్తున్నారు. వర్షం వల్ల భారత్‌- మ్యాచ్‌ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు. అప్పుడు రోహిత్‌ సేన ఏడు పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. బంగ్లాదేశ్‌పై పాక్‌ నెగ్గినప్పటికీ ఆరు పాయింట్లే ఉంటాయి కాబట్టి బాబర్‌ సేన ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement