Saturday, April 20, 2024

కొత్త శిఖరాలకు సూచీలు.. వరుసగా ఎనిమిదో రోజూ బుల్‌రన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జోరు కొనసాగిస్తున్నాయి. వరుసగా ఎనిమిదవ రోజూ ముందుకు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు అనుకూలంగా మారాయి. గత కొద్ది రోజులుగా సూచీలు సరికొత్త గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెవ్‌ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌లో దూకుడుకు కారణం అయ్యాయి. మరోవైపు చమురు ధరలు క్రమంగా దిగొస్తుండటం కూడా కలిసొచ్చింది. రూపాయి బలపడటంతో ర్యాలీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 63,357 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 63,583 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాల్ని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి 184 పాయింట్ల లాభంతో 63,284 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 18,871 వద్ద ప్రారంభమై, 18887 పాయింట్ల గరిష్టాన్ని తాకింది.

చివరకు 54 పాయింట్ల వృద్ధితో 18,812 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌-30 సూచీలో అల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌ టీ షేర్లు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీయూఎల్‌, టైటాన్‌, మారుతీ, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.15వద్ద నిలిచింది. గురువారం ట్రేడింగ్‌లో ఐటీ, మెటల్స్‌, సిమెంట్‌, సెలెక్టెడ్‌ ఫైనాన్షియల్‌ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. నిప్టీn త్వరలో 20,000 మార్కును తాకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement