Tuesday, April 23, 2024

Follow up | నష్టాల బాటలో సూచీలు.. వెంటాడుతున్న అంతర్జాతీయ ప్రతికూలతలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు వరుసగా రెండవ రోజూ నష్టాల్లో ముగిశాయి. ప్రతికూలంగా ప్రారంభమైన ట్రేడింగ్‌ రోజంతా ఒడుదొడుకుల్లో చలించాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి. హెచ్‌సీయూఎల్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ వంటి ప్రముఖ షేర్లు నష్టపోవడం మార్కెట్‌ సూచీలను కిందకులాగేసింది. శుక్రవారం 60,901 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 61,001 వద్ద గరిష్టాన్ని 60,585వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 236 పాయింట్ల నష్టంతో 60,621 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీ సైతం 18,115 వద్ద లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించి చివరకు 80.20 పాయింట్ల నష్టంతో 18,027 వద్ద ముగిసింది. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.13వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో కేవలం 10 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టి, ఇన్ఫోసిస్‌, భారతి ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా వంటి షేర్లు నష్టపోయాయి. త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహంగా ఉండటంతో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ షేరు 5 శాతం మేరకు నష్టపోయింది. చివరకు 3233 వద్ద స్థిరపడింది. అదే సమయంలో మెరుగైన ఫలితాలతో రాణించిన ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్‌ 3.36 శాతం లాభపడి రూ.4100కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement