Friday, April 19, 2024

మహిళ బాగుంటేనే ఇంటికి ఆరోగ్యం : మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనతరం మహిళా ఆరోగ్యం ఇంటి సౌభాగ్యం పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఒకే రోజు 15నార్మల్ డెలివరీలు చేసిన వైద్య బృందాన్ని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోవడానికి ఇష్టం లేక, చికిత్స కోసం వెళ్లే తీరిక లేక వ్యాధుల గురించి వారు పట్టించుకోవడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆడబిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని. మహిళ బాగుంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆరోగ్య మహిళ’ ద్వారా ఏర్పాటు చేసిన దవాఖానల్లో అటెండర్‌ నుంచి డాక్టర్‌ వరకు అందరూ మహిళలే ఉంటారని, నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. మహిళలకు ఆరోగ్య మహిళ ద్వారా 8 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, 80 శాతం మహిళలకు ఇక్కడే ఉచిత పరీక్షలు, మందులు, సూచనలు, ఆరోగ్య సలహాలు లభిస్తాయని, ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్‌ చేస్తారని, అక్కడ మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌, ప్రత్యేక వార్డు ఉంటుందని వివరించారు.

చికిత్స చేయించుకునే స్థోమత లేని మహిళలు తమ ఇబ్బందులు చెప్పుకోలేక వ్యాధులు ముదిరిపోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ మహిళల కోసం ఇచ్చిన కానుక‘ ఆరోగ్య మహిళ అన్నారు. 24 గంట‌ల్లో 19 కాన్పులు చేసి అందులో 15మందికి నార్మల్‌ డెలివరీలు చేసి మ‌హ‌బూబాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి రికార్డు సాధించిందన్నారు. పేషంట్లతో పాటు వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక చొరవ తీసుకుంటానాని హామీ ఇచ్చారు. అనంతరం రేడియాలజీ హబ్ ను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో పలువురు పేషెంట్లను మంత్రి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాతోడ్ తో పాటు జిల్లా జడ్పీ చైర్ ప‌ర్స‌న్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, DM&HO హరీష్ రాజ్, సూపర్డెంట్ శ్రీనివాస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement