Thursday, April 25, 2024

అల్లం మాటున గంజాయి దందా! హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలింపు..

అల్లం పేరుతో గంజా యిని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న ఓ ముఠా ను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.1.8 కోట్ల విలువైన ఎనిమిది వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, డీసీఎంను సీజ్‌ చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ మీదుగా నాసిక్‌కు గంజాయిని సరఫరా చేసే ప్లాన్‌ను ముందే తెలుసుకుని, హైదరాబాద్‌కు చేరుకున్న గంజాయి వాహనాన్ని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు, మియాపూర్‌ పోలీసులు కలిసి పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి ఎనిమిది వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన వికాస్‌, ఒడిశాకు చెందిన సుభాష్‌లు ఇద్దరు కొంతమంది వ్యక్తుల ద్వారా ఒడిశా నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేసేవారు. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన అశోక్‌, యూపీకి చెందిన అమోల్‌, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, మహారాష్ట్రకు చెందిన విలాస్‌ జగన్నాథ్‌, ఫిరోజ్‌ మో మిన్‌, సుదామ్‌ గొటేకర్‌లు ముఠాగా ఏర్పడి ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి కిలో గంజాయిని కేవలం వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసి ఆ తర్వాత గంజాయిని హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు పంపేవారు. అక్కడ కిలో గంజాయికి ఇరవై వేలకు పైగా విక్రయించేవారు.

ఈ మేరకు ముందస్తుగా నిర్ణ యించిన పథకంలో భాగంగా ఒడిశా నుంచి మహా రాష్ట్రకు డీసీఎంలో తరలించేందుకు రెడీ అయ్యారు. పోలీసులకు చిక్కకుండా నిందితులు డీసీఎం వ్యాన్‌లో పైన అల్లం బస్తాలు, లోన మాత్రం గంజాయి సంచులతో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే పక్కా సమాచారంతో హైదరాబాద్‌కు డీసీఎం చేరుకోగానే శంషాబాద్‌ ఎస్‌వోటీ సీఐ వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మియాపూర్‌ వద్ద పట్టుకుని మియాపూర్‌ పోలీసులకు అప్పగించారు. నిందితులు కారుతో పాటు డీసీఎం వాహనం, ఎనిమిది వందల కిలోల గంజాయి, ఐదు సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా. పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement