Friday, March 29, 2024

శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా..హుజురాబాద్ ఉప ఎన్నిక..

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ లో పాత్రికేయులతో మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు, హెల్త్ డెస్క్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. మాస్కులు లేకుండా వచ్చే ఓటర్లకు హెల్త్ డెస్క్ లో మాస్కులు అందచేస్తున్నారని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45శాతం ఓటింగ్ జరిగిందని, సాయంత్రం 7గంటల వరకు ఇంకా ఎక్కువ మొత్తంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.

ఉప ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 కేంద్ర పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి.. పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహిస్తున్నామని అన్నారు. ఓట‌ర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్లoదరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ముందు రోజువరకు 3.50 కోట్ల నగదు సీజ్ చేశామని,1075 లీటర్ల మద్యం కూడా సీజ్ చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.సాయంత్రం 3 గంటలవరకు హుజురాబాద్ లో 61.66 శాతం పోలింగ్ న‌మోద‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement