Friday, March 29, 2024

భారత్‌లో ఆకలి కేకలు.. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్ లో 121లో 107వ స్థానం

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2022లో మన దేశం అంత్యంత దయనీయ స్థితిలో ఉంది. మొత్తం 121 దేశాల ర్యాంక్‌లను అకలి ఇండెక్స్‌లో పేర్కాన్నారు. ఇందులో మన దేశం 107వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలో మన కంటే 109 ర్యాంక్‌తో ఒక్క అఫ్ఘనిస్థాన్‌ మాత్రమే వెనుకబడి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌ ర్యాంక్‌ 99, బంగ్లాదేశ్‌ ర్యాంక్‌ 84, నేపాల్‌ 81, శ్రీలంక 64 ర్యాంక్‌తో ఎంతో మెరుగైన స్థితో ఉన్నాయి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్‌ఐ) ప్రపంచ స్థాయిలో, రీజియన్‌, దేశాల స్థాయిలో ఆకలి సూచీలను వెల్లడిస్తుంది. మన దేశానికి ఈ సూచీలో 29.1 శాతం స్కోర్‌తో అత్యంత సీరియస్‌ అన్న లేబుల్‌ పొందింది. 2021లో మన దేశం మొత్తం 116 దేశాల్లో 101 ర్యాంక్‌ పొందింది. 2020లో మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆసియా రీజియన్‌లోనే ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆకలి స్థాయి ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా పిల్లల కుంగుబాటు రేటు, ఇప్పటి వరకు అత్యధిక పిల్లల వృధా రేటు ఇక్కడే ఉందని పేర్కొంది. ఇండియాలో పిల్లల వృధా రేటు 19.3 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే ఏ దేశంకంటే కూడా చాలా ఎక్కువ. దీని కారణంగానే ఈ రీజియన్‌ ముందుందని పేర్కొంది.
ఇండియా, పాకిస్థాన్‌, అఫ్ఘనిస్తాన్‌ దేశాల్లో పిల్ల కుంగుబాటు రేటు 35 నుంచి 38 శాతం వరకు ఉందని, ఈ విషయంలో అఫ్ఘనిస్తాన్‌ అగ్రభాగాన ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

భారత్‌లో పోషకాహార లోపం 2018-2020లో 14.6 శాతం నుంచి 2019-2021 నాటికి 16.3 శాతానికి పెరిగింది. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న జనాభా 828 మిలియన్లు ఉంటే, ఇక్క ఇండియాలోనే 224.3 మిలియన్ల మంది ఉన్నారు. దేశంలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల విషయంలోనూ భారత్‌లో పరిస్థితులు అంతబాగాలేవని పేర్కొంది. 2012-16 సంవత్సరాల్లో పిల్లల మరణాల రేటు 15.1 శాతం నుంచి మరింత దిగజారి 2017-21 నాటికి 19.3 శాతానికి చేరుకుందని నివేదిక పేర్కొంది. పిల్లల కుంటుబాటు విషయంలో మాత్రం భారత్‌ కొంత మెరుగుపడింది. 2012-16 సంవత్సరాల మధ్యలో పిల్లల్లో కుంగుబాటు 38.7 శాతం ఉంటే, 2017-21 నాటికి కొంత మెరుగుపడి 35.5 శాతానికి చేరింది. శిశు మరణాల విషయంలోనూ కొంత మెరుగుదల ఉంది. 2014లో ఇది 4.6 శాతం ఉంటే, 2020 నాటికి 3.3 శాతానికి తగ్గింది. దేశంలో రాష్ట్రాల మధ్య ఈ విషయంలో తేడాలు ఉన్నాయని వెల్లడించింది.

2006 నుంచి 2016 వరకు వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల మూలంగా పిల్లల కుంగుబాటు విషయంలో ఛత్తీష్‌ఘడ్‌, గుజరాత్‌, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా పోషకాహారం, వైద్య సదుపాయలు పెరగడం, తల్లి ఆరోగ్యం, విద్య, కుటుంబాల ఆదాయం పెరగడం వంటి కారణాల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, కోవిడ్‌ ప్రభావం, ఉక్రెయిన్‌ సంక్షోభం వంటి కారణాల వల్ల ఆకలి సమస్య పెరగడానికి ప్రధాన కారణాలని నివేదిక అభిప్రాయపడింది. పరిస్థితి ఇలానే ఉంటే ఇది ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందని నివేదిక హెచ్చరించింది. సమస్య పరిష్కారం కోసం పెట్టుబడులు పెరగాల్సి

- Advertisement -

ఉందని పేర్కొంది. ఆకలిని ఎదుర్కోవడానికి విధానాలను సరిగా అమలు చేయకపోవడం, రాజకీయ చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందని అభిప్రాయపడింది.
నివేదికపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి స్పందించారు. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల చీకటి పాలన ఫలితమే ఈ సమస్యకు ప్రధాన కారణమని, దీనికి ప్రభుత్వమే భాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2014 నుంచి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగానే ఆకలి సూచీలో దేశం మరింత దిగజారడానికి కారణమని ఏచూరి విమర్శించారు. దేశంలో తక్కవ ఆహార ధాన్యాలు నిల్వలు ఉండటం, దీని వల్ల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇకనైనా అసత్యాలు ప్రచారం చేయడం, అన్నింటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం మానుకోవాలని ఆయన కోరారు.
ప్రధాన మంత్రి ఇకనైనా పిల్లల్లో ఉన్న పోషకాహార లోపం, కుం గుబాటు, మరణాల గురించి, 22.4 కోట్ల మందికి సరైన ఆహార లభించకపోవడం గురించి మాట్లడితే మంచిదని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement