Wednesday, April 24, 2024

బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి?

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ పేరు వింటేనే ప్రజలు వ‌ణికిపోతున్నారు. బ‌ల‌హీనంగా ఉన్న క‌రోనా పేషెంట్ల‌లో ఈ ఫంగ‌స్ ప్రాణాంత‌కంగా మారింది. ముకోర్ అనే ఫంగస్ వల్ల బ్లాక్ ఫంగ‌స్ శ‌రీరంలో ఏర్ప‌డుతోంద‌ని వైద్యులు చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండు లేదా మూడు రోజుల్లో ఈ ఫంగ‌స్ లక్షణాలు ఏర్ప‌డుతున్నాయ‌ని గుర్తించారు. ఈ ఫంగ‌స్ సోకిన వారిలో ముఖం వాస్తుంద‌ని, ముక్కు ఒక‌వైపు మూసుకుపోవ‌డం, క‌ళ్ల కింద వాపు రావ‌డం లాంటివి జ‌రుగుతున్నాయి. అలాగే త‌ల‌నొప్పి, జ్వ‌రం, అల‌స‌ట లాంటివి కూడా దీని ల‌క్ష‌ణాలే. ఈ ఫంగ‌స్ ముందు సైన‌స్‌లో చేరి ఆ త‌ర్వాత కళ్ల‌పై దాని ప్ర‌భావాన్ని చూపుతుంది. అక్క‌డి నుంచి 24 గంటల్లో బ్రెయిన్​‌కు సోకుతుంది. ఆ త‌ర్వాత బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోయే ప్ర‌మాదం ఉంద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. తొలుత మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో దీని ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డగా.. తాజాగా ఏపీ, తెలంగాణలోనూ పలు చోట్ల పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో కరోనా బాధితుల్లో ఉన్నట్లుగా జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయి. అంతే కాకుండా రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు ప్రత్యేకమైన మార్పులుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు నిర్ధారణ చేశారు. ఇది వచ్చిన వారు వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణానికి ప్రమాదమని చెబుతున్నారు. దీనికి యాంటీ ఫంగల్ చికిత్స చేస్తే త్వరగా కోలుకోవచ్చని తెలుస్తోంది. ప్రాణాపాయం ఉన్న వారిని యాఫోటెరిసన్​ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి కాపాడొచ్చని చెబుతున్నారు. కానీ ఈ ఇంజక్షన్ కోసం ఒకరోజుకు రూ.9వేలు ఖర్చు చేయాలి. మూడు వారాలపాటు ఈ ఇంజక్షన్ ఇవ్వాలి. అప్పుడు వారికి ప్రాణాపాయం తప్పుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement