Wednesday, April 24, 2024

నేను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జలకు ఎలా తెలుసు? : ఆనం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారంగా ఓటేశానని ఆనం తెలిపారు. రహస్యంగా జరిగే పోలింగ్ లో నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందురోజు సజ్జల మాట్లాడుతూ ‘ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు, మేం అతడిని ఓటు అడగలేదు’ అని చెప్పారన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత రూ.20 కోట్లు తీసుకుని నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల ఎలా ఎదిగాడో తనకు తెలుసని ఆనం పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను నిలదీశారు. అందరూ తనలానే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. డబ్బు తీసుకొని ఓటేయాల్సిన అవసరం తనకులేదని ఆనం స్పష్టం చేశారు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement