Thursday, March 28, 2024

బార్లు, థియేటర్లపై కరోనా ఆంక్షలేవీ?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. పరీక్షలు, చికిత్స, నియంత్రణపై ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అయితే, మద్యం దుకాణాలు, థియేటర్లు, బార్లు, పబ్​లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని… ప్రభుత్వం పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుంటే నెమ్మదిగా పెంచడమేంటని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది.

కరోనా పాజిటివ్, మరణాల రేటు వెల్లడించాలని పేర్కొంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని… కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న హైకోర్టు.. కరోనా నిబంధనలు పాటించని వారి వివరాలు  తెలపాలని పేర్కొంది. నమోదైన కేసులు, జరిమానాల వివరాలు తెలపాలని సూచించింది. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement