Friday, April 19, 2024

హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

చ‌త్తీస్‌గఢ్‌ బీజాపూర్​లో జరిగిన కాల్పులపై మావోస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ చనిపోలేదని అందులో పేర్కొన్నారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. హిడ్మా సురక్షితంగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు. ‘‘హిడ్మా సురక్షితంగా ఉన్నాడు. దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లతో దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్ట్‌ పార్టీ నాయకత్వం, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రీ పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీనిలో భాగంగానే మాపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలి’’ అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

హిడ్మా కోసం కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల కిందట సైతం భద్రతా బలగాల ఆపరేషన్‌ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా తన అనుచరులతో మకాం వేసినట్లు బలగాలకు తాజాగా సమాచారం అందడంతో బీజాపూర్‌- సుక్మా సరిహద్దులో ధరేలీ-కామరతోగు మధ్య కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని.. ఈ ఘటనలో గాయపడిన భద్రతా బలగాలను తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈఘటనలోనే హిడ్మా మృతిచెందినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగింది. కానీ దీనిపై రాత్రి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement