టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజను విచారించారు. ఇదే కేసులో నోటీసులు అందుకున్న సినీనటుడు నవదీప్ సోమవారం నాడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు.
కాగా మూడు రోజుల విరామం అనంతరం ఈడీ అధికారులు ఈ కేసులో మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. గత 10 రోజులుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఒకరిని కార్యాలయానికి పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారించనున్నారు. నవదీప్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే, డ్రగ్స్ సరఫరాదారులతో ఆయనకు ఉన్న సంబంధాలు, అతడితో జరిపిన సంప్రదింపులపై ఆరా తీస్తున్నారు.